March 18, 2023

అట్టహాసంగా జొహరాపురం వంతెన ప్రారంభోత్సవం

1 min read
KURNOOL MLA

హాజరైన జిల్లా కలెక్టర్, కర్నూలు ఎమ్మెల్యే, నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు

కర్నూలు నగరం పరిశుభ్రంగా ఉండేలా మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం :
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు

రాబోయే రోజుల్లో కర్నూలు నగరం మరింత అభివృద్ధికి కృషి – జొహరాపురం వంతెన పూర్తి కావడానికి కృషి చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు : కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

కర్నూలు అందమైన, పొల్యూషన్ లేని నగరంగా, పచ్చదనంగా ఉండేలా తీర్చిదిద్దుతాం : కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య

కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 27, (కర్నూలు ప్రభ న్యూస్) :

కర్నూలు నగరం దేశంలోనే పరిశుభ్రంగా ఉండేలా మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదివారం జొహరాపురం నుంచి జమ్మిచెట్టు వరకు హంద్రీ నదిపై నిర్మించిన వంతెనను ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా కలెక్టర్, కర్నూలు ఎమ్మెల్యే, నగర మేయర్ లు సంయుక్తంగా డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ లతో కలిసి రిబ్బన్ కట్ చేసి అట్టహాసంగా వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ హంద్రీ నది పై అసంపూర్తిగా ఉన్న జొహరాపురం వంతెనను ఆగస్టు మాసంలో పరిశీలించినప్పుడు కర్నూలు ఎమ్మెల్యే, నగర మేయర్ చాలా సూచనలు ఇచ్చి జొహరాపురం వాసులకు ఈ వంతెన చాలా అవసరమని, ఈ వంతెన పనులను వేగవంతం కోసం ప్రత్యేక చొరవ చూపారన్నారు. అందులో భాగంగా జొహరాపురం వంతెనను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కర్నూలు నగరానికి కావాల్సిన మంచినీటి సదుపాయం, కర్నూలు నగరం స్వచ్ఛ స్వరక్షణ, కర్నూలు నగరం మన అందరిదీ కనుక ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి క్లీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరం దేశంలోనే పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడానికి మనం అందరం కలిసికట్టుగా పని చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జొహరాపురం వంతెన మంజూరు చేయడం జరిగింది కానీ ఏదైతే ఫైనాన్స్ క్లియర్ కావాలో అది చేయలేదని, గత ప్రభుత్వం ఫైనాన్స్ క్లియరెన్స్ బడ్జెట్ కేటాయింపులో చేయకపోవడంతో వంతెన పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ కు నిధులు రాలేదని వంతెన పనులను నిలిపివేశారన్నారు. జొహరాపురం వాసుల కష్టాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని హంద్రీ నది పై వంతెన త్వరగా నిర్మించాలని ఫైనాన్స్ క్లియర్ చేశారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల కష్టాలు తొలగించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లు ప్రత్యేక కృషి చేశారన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి, మంచి పరిపాలన, పారదర్శకంగా ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు బ్రహ్మాండంగా మనదేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా ముందుకు వెళ్తున్నాం అన్నారు. రాబోయే రోజుల్లో కర్నూలు నగరానికి మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇదివరకే కర్నూలు నగర మేయర్ ఆధ్వర్యంలో గ్రీన్ సిటీలో భాగంగా 50 వేల మొక్కలు నాటడం జరిగింది అన్నారు. గతంలో పోల్చుకుంటే పారిశుద్ధ్యం మరింత మెరుగు పడిందన్నారు. జొహరాపురం వంతెన పనులు పూర్తి కావడంలో కృషి చేసిన రాష్ట్ర ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రి, కర్నూల్ కార్పొరేషన్ కమిషనర్, నగర మేయర్, కార్పొరేటర్లు, అధికారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య మాట్లాడుతూ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతోనే నగర సుందరీకరణ, క్లిన్ ఆండ్ గ్రీన్ సిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం జొహరాపురం వంతెన పనులను ప్రారంభించారే తప్ప పనులు పూర్తి చేయలేదని, ఈ ప్రభుత్వం జొహరాపురం వాసుల కష్టాలను తెలుసుకొని వంతెన పనులను పూర్తి చేసి ఈ రోజు తమ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధిపైన రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేక దృష్టి ఉందని, రాబోయే రోజుల్లో న్యాయ రాజధాని కాబోతోంది, హైకోర్టు కూడా కర్నూలుకు రాబోతోంది అన్నారు. ఇప్పటికే కర్నూలు కార్పొరేషన్లో అభివృద్ధి విషయంలో చాలా మార్పులు గమనించారన్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది, అందరి సహకారంతో కర్నూలు కార్పొరేషన్ క్లీన్ అండ్ గ్రీన్ లో స్వచ్ఛ సర్వేక్షన్ లో ఎక్కడో 190 ర్యాంకులో ఉన్న కర్నూలును 70 ర్యాంక్ లోకి తీసుకురావడం జరిగిందన్నారు. రాబోయే సంవత్సరానికి క్లీన్ అండ్ గ్రీన్ లో కర్నూలు నగరం దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలో కూడా మొదటి స్థానంలో ఉండేందుకు అందరం శయశక్తులా కృషి చేద్దాం అన్నారు. కర్నూలు ఒక అందమైన నగరంగా, పొల్యూషన్ లేని నగరంగా, పచ్చదనంగా ఉండేలా ఖచ్చితంగా తీర్చిదిద్దుతమని నగర మేయర్ అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, కార్పొరేటర్లు, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, తదితరులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!