September 27, 2023

సావిత్రిబాయి పూలె వర్ధంతి

1 min read

సావిత్రిబాయి పూలె వర్ధంతి

డోన్ టౌన్, మార్చి10, (సీమకిరణం న్యూస్) :

పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాతపేట డోన్ నందు సావిత్రి భాయి ఫూలే వర్ధంతి సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ అధ్యక్షతన సావిత్రి భాయి ఫూలే విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా సీనియర్ ఉపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే పేరు పొందారు.1831 జనవరి 3 న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించింది. ఆమె తన తొమ్మిదవ ఏటనే పన్నెండేళ్ళ జ్యోతిరావు పూలేతొ 1840 లో వివాహం జరిగింది. నిరక్షరాస్యులైన ఆమె, భర్త జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతో, వారి వద్దనే విద్యనభ్యసించి, విద్యా వంతురాలు అయింది. ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1848 జనవరి1న భర్త జ్యోతిబాపూలే తో కలిసి అణిచివేతకు గురైన కులాల బాలికల కోసం పూణేలో సావిత్రిబాయి మొదటి పాఠశాలను ప్రారంభించింది. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద లాంటి సమస్త హక్కులు నిరాకరించబడిన సమాజంలో ఆనాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను ఎదిరించి,విధి నిర్వహణ విషయంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని నిలిచి,గెలిచారు. కేవలం నాలుగు సంవత్సరాల కాలంలోనే గ్రామీణ ప్రాంతాలలో 20 పాఠశాలలను ప్రారంభించి, ఉచిత విద్యనందించి విద్యా ఉద్యమాన్ని ప్రారంభించిన ఆమె వయస్సు కేవలం 18 ఏళ్లు మాత్రమే. జీవితకాలం మొత్తంలో 52 పాఠశాలను ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య భావజాలం గల వారి నుండి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొన్నది. ఈ నేపథ్యంలో చివరికి 1849లో భర్త తో కలిసి గృహ బహిష్కరణ కు గురి కావలసి వచ్చింది. స్త్రీ, పురుషులు కుల మతాలకతీతంగా విద్య నభ్యసించడం సహజమైన హక్కు అని, అందుకే అందరూ చదవాలి – అందరూ సమానంగా బ్రతకాలి అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మూర్తి సావిత్రి బాయి.
ఆమె మహిళా హక్కులే మానవ హక్కులు అని తొలిసారిగా నినదించిన గొప్ప విప్లవ వనిత సావిత్రిబాయి పూలే.1873లో తన భర్త జ్యోతిబాపూలే తో కలిసి సత్యశోధక్ సమాజ్ ను ప్రారంభించింది. బాల్య వివాహాలకు, మూఢనమ్మకాలకు, సతిసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహాల కొరకు బలమైన ఉద్యమం నడిపారు. పురోహితులు లేకుండా వివాహాలను, ఇతర శుభకార్యాలను ఈ సంస్థ ద్వారా చేసేవారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవిస్తున్న ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి, వారి జీవితాలకు వేలుగునిచ్చారు. 1870 లో కరువు వాత పడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు రెండు వేల మందిని అక్కున చేర్చుకొని, వారికి తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని అందించారు. 1890లో భర్త జ్యోతిరావ్ పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే సనాతన ఆచారాలకు విరుద్ధంగా తానే ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు చేసి, అభ్యుదయ భావాలు కలిగిన సంస్కరణవాదిగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచి పోయింది. సావిత్రీబాయి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాత్రమే కాకుండా గొప్ప రచయిత్రి. 1854లో “కావ్య పూలే” అనే ఒక కవితా సంపుటి రచించారు. “అభంగ్” అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టే లా ఉండేది. సూటిగా, సరళంగా, ప్రకృతి వర్ణన, జానపద కళలు ప్రతిబింబించే కావ్య రచనలు చేశారామె. క్రాంతి బాయి గా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధ్రువతారగా వెలుగొందుతూనే ఉంటుంది 1897 లో ఆమె వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తున్న క్రమంలో పాండురంగ గైక్వాడ్ కొడుకు ప్లేగు వ్యాధి బారిన పడటం గమనించి, ఆసుపత్రికి తీసుకు వచ్చే క్రమంలో, ఎవరూ లేక స్వయంగా తానే తన 66వ ఏట భుజంపై ఆ బాలుడిని వేసుకొని, ఆసుపత్రికి తీసుకు వస్తున్న సందర్భంలో ఆ బాలుడి శ్వాస ఆమె పీల్చడంవల్ల తాను కూడ వ్యాధిబారిన పడింది. ఆ బాలుడు బ్రతికాడు కాని, ఆమె 1897 మార్చి 10 న మరణించింది. సావిత్రిబాయిని స్ఫూర్తిగా తీసుకొని వివిధ రంగాలలో రాణించిన మహిళలు డాక్టర్ ఆనంది బాయి జోషి, పండిత రమాబాయి సంఘసంస్కర్తగా రాణించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్, చంద్రశేఖర్ గౌడ్, వెంకట రమణ, వెంకట లక్ష్మీ, లక్ష్మయ్య, అల్లిపీరా, లక్ష్మి కాంతరెడ్డి, మద్దిలేటి,సుబ్బారాయుడు, మధుసూదనరెడ్డి, సుభాన్ భాష, దేవేంద్రప్ప, నూర్జహాన్, భాను ప్రకాష్ రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీ కళ, రమేష్, ఆదినారాయణ, సురేష్, శ్రీనివాసులు, మునిరాజు ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.

Copyright © All rights reserved. SK PUBLICATIONS / KURNOOL PRABHA NEWS |
error: Content is protected !!